పేరు (ఆంగ్లం) | Malladi Venkata KrishnaMurthy |
పేరు (తెలుగు) | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | మల్లాది శారదాంబ |
తండ్రి పేరు | మల్లాది దక్షిణామూర్తి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 13/11/1949 |
మరణం | – |
పుట్టిన ఊరు | విజయవాడ |
విద్యార్హతలు | – |
వృత్తి | ఆడిటరు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కల్నల్ ఏకలింగం ఎడ్వంచర్స్ డి ఫర్ డెత్ దైవం వైపు ధర్మ యుద్ధం ఎఫ్ ఐ ఆర్ లూపికా రాణి అతడు ఆమె మందాకిన |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.anandbooks.com/Malladi-Venkata-Krishnamurthy?page=2 |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అనగనగా ఒక నాన్న |
సంగ్రహ నమూనా రచన | జగమెరిగిన బ్రాహ్మణుడి కి జంధ్యమేల అన్నట్టు మల్లాది గారి గురించి కొత్తగా చెప్పక్కరలేదు. దాదాపు గా 100 నవలలు రాసిన మల్లాది గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక నవల ఇంకో నవల కి తేడా గా ఏదన్నా సబ్జెక్టు తీసుకుంటే దాని గురించి సంపూర్తిగా వివరంగా చెప్పడం అయన ప్రత్యేకత. అది పులి మీద కావొచ్చు, చట్టం మీద కావచ్చు, రోగం మీద కావచ్చు ఏదన్నా సరే దాని గురించి విపులంగా, వివరంగా రాయడం అయన ప్రత్యేకత. కథ లో అనవసరమైన వర్ణన కన్నా అవసరమైన ఇన్ఫర్మేషన్ కి ప్రాధాన్యత ఇస్తారు అయన. ఇప్పుడు అంటే గూగుల్ వచ్చి చాలా వరకు సమాచారం మనకి నెట్ లో దొరుకుతుంది. కాని పాతిక ముప్పై ఏళ్ళ క్రితం ఈ సులువు లేదు, కాని మల్లాది గారు అప్పుడు కూడా చాలా సమాచారం సేకరించి రాసేవారు. |
మల్లాది వెంకట కృష్ణమూర్తి
నేను రచయిత అవడానికి ప్రధాన ప్రేరణ నేను బాల్యంలో చదివిన అనేకానేక పత్రికలూ, నవలలు. నాకు ఏడుగురు అక్కలు. వాళ్ళందరికీ పత్రికా పఠనమ్ అంటే ఎంతో ఆసక్తి. మా అమ్మ మల్లాది శారదాంబ ఆంధ్ర ప్రభ వీక్లీ కొనేది. మా పక్కింటివాళ్ళు ఆంధ్ర పత్రికని కొనేవారు. వాటిని మేము ఎక్సేంజ్ చేసుకుని చదువుకునేవాళ్ళం.ఆ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళు ఈపద్ధతిని అనుసరించేవారు. ఇలా నా ఏడో ఏటనించే నేను తెలుగు పుస్తకాలు చదవడం ఆరంభించాను. సాయంత్రాలు నేను మా ఇంటికి ఐదు నిముషాల నడక దూరంలో వున్న గాంధీనగర్లోని ఓ లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలని చదివేవాడిని. అది నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఎస్ కే పీ వీ వీ స్కూల్ సమీపంలో వుండేది. నేను పెద్దయ్యాక అది లేదు.
నాకు గల సాహిత్య జ్ఞాపకాలలో ఒకటి దీపావళికి ఆంధ్ర ప్రభ, ఆంద్ర పత్రికల ప్రత్యెక సంచికలు. ఎక్కువ పేజీలతో, కునేగా మరికొలందు సెంటుతో ఘుమ ఘుమలాడుతూ వచ్చేవి అవి. వాటిని చదవడానికి మా కుటుంబ సభ్యులంతా పోటీ పదే వారం. ఆనాటి చాలామంది పాఠకులకి కూడా ఈ అనుభవం వుండి వుంటుంది. బహుమతి పొందిన కథలని చదివేసాక ఇక వాటి మీద ఆసక్తి తగ్గేది. అలాగే యువ, జ్యోతి మాస పత్రికలూ దీపావళి, సంక్రాంతి పండగలకి ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ప్రముఖ రచయితల కథలు వుండేవి. అవసరాల రామకృష్ణా రావు, ఇచ్చాపురపు జగన్నాథరావు, భరాగో, పెద్దిభొట్ల సుబ్బరామయ్య,ఆదివిష్ణు తదితరుల కథలు వాటిలో వచ్చేవి.
నాకు బాగా గుర్తు. పత్రికల్లోని కొందరి కథలు ఇలా మొదలయ్యేవి.
ఈ లోకంలో మూడు రకాల మనుషులున్నారు. వొకరు తమకోసం తామూ జీవించేవారు. మరొకరు ఇతరులకోసం జీవించేవారు. ఇక ముడో రకం వారు తమకోసం కాని, ఇతరులోసం కాని జీవించేలేనివాళ్ళు. ప్రకాశం ఈ ముడో తరగతికి చెందినవాడు.
మూడోరకం గురించి చెప్పకుండా కథకి సంబంధంలేని మిగిలిన రెండురకాల గురించి ఎందుకు ప్రస్తావిస్తాడు? అని విసుక్కునే వాడిని. లేదా `బాలభానుని నునులేత కిరణాలు పృథ్విని స్పర్సిస్తున్నాయి. పిట్టలు గూటికి చేరుతున్నాయి` ఇలా ఒకటి రెండు పేరాలు ప్రకృతి వర్ణనతో సాగేవి. ఆ పేరాలని స్కిప్ చేసి కథ ఎక్కడనించి మొదలవుతుందా అని వెదికేవాడిని. పత్రికల్లోని రచనలని చదువుతూ కథకి సంబంధం లేని వివరణలు, వర్ణనలని, రచయిత చెప్పే పాత్రల మనస్తత్వ చిత్రణని, ఫిలాసఫీని చదవడంలో విసుగుని అనుభవించేవాడిని.
సంభాషణతో మొదలయ్యే కథ అరుదుగా దొరికేది. వాటిని ఆసక్తిగా చదివేవాడిని.
పన్నెండు ఏళ్ళు వచ్చాక హనుమాన్ పేటలోని జిల్లా గ్రంధాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవాడిని.
ఇవి కాక టెంపోరావు, గుత్తా బాపినీడు, డాక్టర్, భయంకర్, విశ్వప్రసాద్, ప్రసాద్, కనకమేడల,కొమ్మూరి సాంబశివరావు మొదలైన వారి డిటెక్టివ్ నవలలని మా ఇంట్లో అద్దెకి వున్న మద్డాలి సీతమ్మ గారు తమ బంధువుల నుంచి తెచ్చి ఇచ్చేవారు. డిటెక్టివ్ నవలల్లో ఇలా విసుగు కలిగించేవి కనిపించేవి కావు. ఎందుకంటే వారు కథని సంభాషణల ద్వారా నడిపించేవారు. పత్రికల్లోని రచనలకి, డిటెక్టివ్ నవలలకి తేడాని స్పష్టంగా గమనించ గలిగాను. డిటెక్టివ్ నవలల్లో ఫిలాసఫీని చెప్పేవారు కారు. సాధారణంగా నవల సంభాషణలతోనే మొదలయ్యేది. గాంధీనగర్లోని న్యూ ఇండియా సెంటర్లో బళ్ళ మీద అద్దెకి ఇచ్చే కొమ్మూరి నవలలని తెచ్చుకుని చదివే వాడిని. వాటి వెల అర్థరూపాయి. రోజుకి అణా అద్దె. వాటిని అణా లైబ్రరీలు అనేవారు.
ఆరోజుల్లో నేను పత్రికల్లో చదివిన అనేక వేల మంది రచనా విధానాలే నాకు మార్గదర్శకత్వం అయ్యాయి. ఎలా రాయలో కంటే ఎలా రాయకూడదో నాకు చిన్న వయసులోనే తెలిసింది. ఏ సమాచారం పాఠకుడిగా నాకు విసుగ్గా వుండేదో దాన్ని నా రచనలనల్లో దొర్లకుండా నేను రచయితగా మొదటినించి జాగ్రత్తని తీసుకోసాగాను. పైగా మెత్తటి వాక్య నిర్మాణంలో దిట్ట అయిన కొమ్మూరి సాంబశివరావు నవలలు అన్ని అనేకమార్లు చదవడం వల్ల నాకు అలాంటి వాక్యాలు రాయడం బాగా పట్టుపడటం నా అదృష్టం. ఏది పాఠకుడిని కన్ఫుస్ చేయకుండా, వారి మెదడుని స్ట్రైన్ చేయకుండా చెప్పాలి అని నేను బాగా గ్రహించాను. ఆ సూత్ర్రాన్ని ఆనాటి డిటెక్టివ్ రచయితలు గ్రహించి పాటించారు. పత్రికల్లోని కథల పోకడకి, డిటెక్టివ్ నవలల్లోని పోకడకి గల తేడాని పట్టుకోగలిగాను. ఈ కారణంగా నా శైలి సులభంగా వుంటోంది.
నేను కాలేజిలో చదివేప్పుడు ఓ సారి ఓ కథని రాసాను. అది తెలిసి మానాన్న మల్లాది దక్షిణామూర్తి గారు చదువు చెడుతుందని కథలని రాయద్దని చెప్పారు. దాంతో మళ్లీ రాయలేదు. అప్పుడప్పుడు మా నాన్నగారు, `కథలు రాస్తున్నావా? మానేశావా? అని అడిగేవారు కూడా.
బి కాంలో నా క్లాసుమేటు మురళి అని ఒకడు వుండేవాడు. అతనికి కూడా సిస్టర్స్ నాకు లాగానే. దాంతో నాలానే చిన్నప్పటినుంచి చదివేవాడు. ఓ రోజు నాకు వాడు రాసిన కథని చదవమని ఇచ్చాడు. ఘనమైన అయ్యా ` అన్న పదాలతో అది మొదలైంది. మర్నాడు మేము ఇద్దరం అలంకార్ సినిమా హాల్ని దాటి ఎదురుగా వున్నా వంతెన మీదకి రాగానే తన కథ ఎలా వుందని అడిగాడు. కథా రచనలో నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలని అన్నిటి ప్రకారం ఆ కథ బాగా లేదని విస్లేశానాత్మకంగా చెప్పాను. నా పరిజ్ఞానికి వాడికి ఆశ్చర్యం వేసింది. మేము మంచి మిత్రులమే అయినా ఎన్నడు కథల గురించి అంతదాకా మాట్లాడుకోలేదు. ఆతను తర్వాత దేవరకొండ మురళి అనే తన పేరుతో ౧౦ దాక కథలు రాసాడు.
౧౯౭౦లొ నా చదువు బికాం అయిపోయింది. వుద్యోగ రీత్యా సికింద్రాబాద్ వచ్చి, ౧౯౭౦ ఫిబ్రవరిలో మా నాన్న గారు మల్లాది దక్షిణామూర్తి మిత్రులు శ్రీ ముస్త్యాల వెంకయ్య గారి ఇంట్లో, రాష్ట్రపతి రోడ్లోని పోస్ట్ ఆఫీసు ఎదురుగా వున్న ఇంట్లో బస చేసాను. నాకు చిన్నప్పటి నుంచి కథలకి ఇదియాస్ తట్టేవి. వాటిని ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవాడిని. అక్కడ వుద్యోగంలో చేరిన మొదటి ఆదివారం ఓ కథని రాసాను. తర్వాత ఫెయిర్ చేసి దాన్ని చందమామకి పోస్ట్ చేసాను. పత్రికకి, ప్రభాకి, అపరాధ పరిశోధనకి వరసగా ఒకో కథని ఒకో ఆదివారం రాసి పోస్ట్ చేసాను. నేను అప్పుడు ఓ సంగతి గమనించాను. ఫెయిర్ చెయ్యడానికి చిత్తు ప్రతి చూడకుండానే తర్వాతి పదం, వాక్యం అలానే రాసేవాడిని. తర్వాత చూస్తే చిత్తు ప్రతిలో అలాగే వుండేది. ఇలా చాలాసార్లు అనుభవం అయ్యాక నేను వాక్యాలని, పదాలని ఒకేలా రాస్తానని అర్థమయ్యింది. దాంతో తిరగరాసే ప్రయత్నం మానుకున్నాను.
వెంకయ్య గారి పుత్రులు ముస్త్యాల భూమయ్య, లక్ష్మణ్ రావులు. లక్ష్మణరావు గారికి, ఆయన శ్రీమతి ప్రభావతికి పత్రికా పఠనమ్ అలవాటు. నేను సికందరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సిటి బస్సు ఎక్కేవాడిని. అక్కడ మేగ్సిన్స్ అమ్మే షాపులు చాలా వుంటాయి కాబట్టి నన్నువారం, వారం ప్రభ, పత్రికలని, నెల నెలా చందమామని కొనుక్కు రమ్మని, నెలాఖరుకి లెక్క చూసి డబ్బు ఇచ్చేవారు. వారు కారు ఆపుకుని కొనాల్సి వచ్చేది కాబట్టి ఆ పనిని నాకు పురమాయించారు.
ఆగస్టు రెండు ౧౯౭౦. ఆరోజు నేను చందమామని సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఓ పుస్తకాల షాపులో కొన్నాను. బస్సులో కూర్చోడానికి చోటు లేక నించుని రావడంతో దాన్ని తిరగేయలేదు. ఇంటికి నడిచి వస్తు చూసాను కాని నాకు నా కథ కనపడలేదు. రాగానే లక్ష్మణరావు గారు నా చేతిలోంచి దాన్ని తీసుకుని తెరవకుండానే చెప్పారు.
“దీంట్లో నీ కథ ఒకటి పడిందని పందెం.“
నేను ఆ పత్రికకి కథని పంపానన్న సంగతి గుర్తున్న్నా వేసుకుంటామనే కార్డు రాలేదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాను.
“రాలేదని పందెం.“
“కథ వస్తే దీనికి పంపే డబ్బు నాకు ఇవ్వాలి.“ చెప్పారు.
“అలాగే.“ధైర్యంగా వొప్పుకున్నాను.
ఆయన ఓ పేజి తెరచి అందులో వచ్చిన సింగిల్ పేజి కథని నాకు చూపించారు. `వుపాయసాలి` అన్న పేరు గల ఆ కథ, కింద మల్లాది వెంకట కృష్ణ మూర్తి అనే పేరు కనపడింది. అది నేను రాసిన కథే!.అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ సంగతి ఆయనకీ ఎలా తెలిసిందో. బహుసా చందమానించి కథని ప్రచురణకి తీసుకున్నమన్న కార్డ్ వచ్చి వుంటుంది. అది ఆయన దాచి వుండచ్చు. నాకు ఎన్నడు ఆ కార్డు ఆయన ఇవ్వలేదు. ఆ కథ చదవాలనుకునేవారు ఈ లింకుని క్లిక్ చేయండి. వుపాయసాలి. ఆ విధంగా తొలిసారి ౧౯౭౦ ఆగష్టు రెండో తారీకు సాయంత్రం అయిదున్నర-ఆరు మధ్య నా పేరుని ౬౮ రాష్ట్రపతి రోడ్లోని ఆ ఇంట్లో అచ్చులో చూసుకున్నాను. ఆ ఇంట్లో చాల కథలు రాసాను
ప్రఖ్యాత అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ ఇరవై ఏళ్ళపాటు అనేక పోయంస్ రాసాడు. కాని అతని ముప్ఫై తొమ్మిదో ఏట కాని అతని పొయిట్రీ బుక్ ని పబ్లిషర్లు ప్రచురించలేదు. ఈ రోజు అతని పద్యాలు ఇరవై రెండుభాషల్లోకి అనువదించబడ్డాయి. నాలుగు సార్లు పొయిట్రీలో రాబర్ట్ ఫ్రాస్ట్ కి పుల్లిడ్ జర్ ప్రైజులు వచ్చాయి. ఆయన్ని సాహితీ లోకం ఆలస్యం గా గుర్తించింది. ఈ విషయంలో నేను అద్రుష్ఠవంతుడిని అనే చెప్పాలి. నేను రాసిన మొదటి కథే వెనక్కి రాకుండా ప్రచురించబడింది. అంతే కాకుండా వరసగా పత్రిక, ప్రభ, అపరాధ పరిశోధనల్లో కూడా నాకథలు వెంట వెంటనే వరసగా వచ్చాయి.
1970 నించి నా సాహిత్య మార్గంలో జరిగిన అనేక సంఘటనలని, అనుభవాలని పాఠకులతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఆరంభిస్తున్నాను. తరచూ నన్ను పాఠకులు అడిగే అనేక ప్రశ్నలకి జవాబులు ఇందులో దొరుకుతాయి. నాకు ఈ మార్గంలో పరిచయం వున్న అనేకమంది ప్రముఖుల గురించి రాసే వివిధ విషయాలు, వారితో నా అనుభవాలు చదవడానికి పాఠకులకి ఆసక్తిగా వుంటాయని విశ్వసిస్తున్నాను. నాకు డయిరి రాసే అలవాటు లేదు కాబట్టి తారీఖులు, నెలలు, సంవత్సరాలు, కొందరి పేర్లు అన్ని సందర్భాల్లోనూ ఇవ్వలేను. అందుకని కేవలం జరిగిన వాటి సారాంసాలని మాత్రమే ఇవ్వగలను. ఎలాంటి దాపరికాలు లేకుండా రాయదలచుకున్నాను కాబట్టి పాఠకులు దీన్ని కల్పితంగా భావించనవసరం లేదు. ఏ విషయం మీదైనా వారు ఇంకాస్త వివరాలు తెలుసుకోడానికి ప్రశ్నలు వేయచ్చు. అలాగే ఏ విషయం మీద తెలుసుకోవాలని వుందో దాన్ని అడిగితే ఆ వివరాలు రాస్తాను. అయితే వో టాపిక్కు ముగిసేదాకా ఆగి దాని మీద నేను చెప్పని వాటి గురించి అడిగితే ఎవరికీ సమయం వృధా కాదు. మీరు టాపిక్కులని సూచించవచ్చు. నేను రాయదలచుకున్న జాబితాలో అది వుంటే ఆ సంగతి తెలియచేస్తాను. లేకపోతే మిగతా పాఠకులకి, నాకు ఈ విషయంలో సహాయం చేసినవారు అవుతారు. అనుమానం వున్న సంగతులని వదిలేయదలిచాను కాని అసత్యాలని మాత్రం రాయదలచుకోలేదు.
ఈ బ్లాగుని రోజు రాయగలనా అని అనుమానం. కాబట్టి ఖచ్చితంగా బుధ, ఆదివారాలు పోస్టు చేసే ప్రయత్నం చేస్తాను. మిగిలిన రోజుల్లో కూడా పోస్టు చేయగలిగితే సంతోషం. దీన్ని మీరంతా ఎంజాయి చేస్తారని ఆశిస్తాను.
———–