| పేరు (ఆంగ్లం) | Archarya S. Rajeshwari |
| పేరు (తెలుగు) | ఆచార్య యస్. రాజేశ్వరి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | శివుని రాజేశ్వరి 1959 సెప్టెంబర్ 9వ తేదీన, కడపజిల్లా, ప్రొద్దుటూరులో జన్మించారు. 1992 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకులుగా చేశారు. 28 సంవత్సరాల బోధనానుభవం ఉంది. 5 పుస్తకాలు రచించారు. ఆమె పర్యవేక్షణలో 16 మంది పిహెచ్.డి. పట్టాను పొందారు. 5 మంది ఎమ్ ఫిల్ పట్టాపొందారు. 116 పత్రాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 90 సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. 4 అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. 2016 సింగపూర్ లో జరిగిన 5 వ ప్రపంచ సాహిత్య సదస్సులోను, 2017వ అమెరికాలోని సెంట్ లూయిస్ లో జరిగిన 21 వ తానా ప్రపంచ సాహిత్య సదస్సులో పాల్గొన్నారు. అమెరికాలోని హ్యూస్టన్లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారి నిర్వహణలో ‘పర్వ’ (ఆధునిక భారతం) పైన 2015 లో ఉపన్యసించారు. ఆధునిక కవుల రచనలపైన నాలుగు, పద ప్రయోగ కోశాలు వెలువరించారు. ‘కడప మాండలికం’పైన యుజిసి మేజర్ ప్రాజెక్ట్ చేశారు. 2014 లో తెలుగు అధ్యయన శాఖలో శాఖాధ్యక్షులుగా పనిచేసారు. 2016 నుంచి బిఓయస్ చైర్మన్ గా పనిచేశారు. ఓరియంట్ లాంగ్వేజస్ కు ‘డీన్’గా పనిచేసారు. 2016 లో వీనస్ ఇంటర్ నేషనల్ ఫ్యాకల్టీ వారు భాషాశాస్త్రంలో కృషికి ‘జీవన సాఫల్య అవార్డు’ను బహుకరించారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తిలక్ కథలు – చెహోవ్ ప్రభావం |
| సంగ్రహ నమూనా రచన | కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాల వంటి- వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల వంటి నిశిత పరిశీలనతో నిలిచిన మణి దీపాల వంటి- తిలక్ కథలు 20 సేకరించి 1967లో ప్రచురించారు ప్రకాశకులు. వాటికి మరి 9 కథలు కలిపి 1983 ద్వితీయ ముద్రణ వెలువరించారు. |
ఆచార్య యస్. రాజేశ్వరి
తిలక్ కథలు – చెహోవ్ ప్రభావం
కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాల వంటి- వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల వంటి నిశిత పరిశీలనతో నిలిచిన మణి దీపాల వంటి- తిలక్ కథలు 20 సేకరించి 1967లో ప్రచురించారు ప్రకాశకులు. వాటికి మరి 9 కథలు కలిపి 1983 ద్వితీయ ముద్రణ వెలువరించారు.
1921లో పుట్టిన తిలక్ 11వ ఏటనే కథలు రాయడం మొదలుపెట్టాడు. తాను 1966 లో తనువు చాలించే వరకు కథలు, నాటికలు, పద్యాలు, గేయాలు ఎన్నో రచించాడు. అతను రాసిన కథలపై ‘చెహోవ్‘ ప్రభావం ఉందని విమర్శకుల అభిప్రాయం.
వల్లంపాటి వెంకటసుబ్బయ్య తెలిపిన మంచి కథాలక్షణాల ‘క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్ఠవం తిలక్ కథల్లో పుష్కలంగా ఉన్నాయి. వానిలో ‘నిర్మాణ సౌష్ఠవం‘లో చెహోవ్ తెలిపిన అభిప్రాయాలు తిలక్ కథల్లో కనిపిస్తాయి.
వాటిలో రెండింటిని ఇక్కడ విశ్లేషిస్తాను.
కథ ‘లేసు‘లాగా ఉండాలి.
కథ ‘తాబేలు‘ లాగా ఉండాలి.
అన్నవి ‘చెహోవ్‘ అభిప్రాయాలు. చెహోవ్ కథలు అదేవిధంగా ఉంటాయి. ‘లేసులాగా‘ అన్నమాట అర్థవంతమైనది. దారంతో అల్లిన లేసులో అల్లిన భాగం కంటే అల్లకుండా వదిలేసిన భాగం వల్లనే లేసు డిజైను ఏమిటో తెలుస్తుంది. లేసులో లాగా కథలో కూడా చెప్పిన విషయాల కంటే చెప్పకుండా సూచించి వదిలి పెట్టిన విషయాలకే ప్రాధాన్యత ఎక్కువ ‘కథలో చెప్పవలసిన దానికంటే తక్కువ చెప్పడం మంచిది‘ అంటాడు చెహోవ్.
ఈ పద్ధతిని తిలక్ ‘హోటల్లో‘ అన్న కథలో అనుసరించాడు. ఐదు రోజుల దిన చర్య ఈ కథ. 22.5. 1941 నుండి 26. 5. 1941 వరకు జరిగిన కథ. 10 జూలై 1941లో ‘వాణి‘ సచిత్ర పక్షపత్రికలో ప్రచురించబడింది. మొదటి రోజు, ఆఖరి రోజు కథ గురించి, ఉండదు. ఉత్తమ పురుషలో రాయబడిన కథ. పాత్రలకు పేర్లు ఉండవు. ఒక వ్యక్తి బందరుకు వచ్చి హోటల్లో దిగాడు. అతన్ని ఒక ఆగంతుకుడు 5 రూపాయల దానంగా ఇవ్వమని అడుగుతాడు. కాని ఈ వ్యక్తి ఇవ్వడు. తన పక్కగదిలో ఒక స్త్రీ ముగ్గురు పురుషులతో కలిసి ఉండడం చూసి అసహ్యించుకుంటాడు. తనను బిచ్చమెత్తిన ఆగంతుకుడే ఆ స్త్రీని బాకుతో పొడిచి చంపుతాడు. చంపాక తన గదిలోకి వచ్చి ఆమె తన భార్య అనీ, తన బాకీ తీర్చడానికి ఆ ముగ్గురి దగ్గర వ్యభిచరించిందని చెపుతాడు. ఆ బాధ తట్టుకోలేకే ఆమె తనను చంపమని ప్రార్థిస్తే చంపానంటాడు. ఆ బాకీ తీర్చడానికే మీ లాంటి దయగల వారి దగ్గర బిచ్చమెత్తానని, ఆ డబ్బే ఉంటే తమకీ గతి పట్టేది కాదని ఏడుస్తాడు. ఆగంతకుడిని పోలీసులు పట్టుకుపోతారు. కథనంతా మూడు సంఘటనలుగా రాసి రచయిత ఆఖర్లో అంతా కలుపుతూ వివరిస్తాడు. కథ మొత్తం ఒకే అల్లిక లాగా ఉంటుంది. కథా సంవిధానం ఉంటుంది. ఇటువంటి కథే రావిశాస్త్రి రాసిన ‘లక్ష్మి‘ కథ కూడా.
నిర్మాణ సౌష్ఠవంలో చెహోవ్ రెండవ పద్ధతి – ‘కథ రాయడం పూర్తయ్యాక, ప్రారంభాన్ని ముగింపుని తీసేయాలి‘ రాసిన తరువాత తీయడం అంటే కథలో వాటిని అదృశ్యంగా ఉంచాలనీ, వాటిని పాఠకుల ఊహాశక్తి వారికే వదలాలని అర్థం.
కొందరి కథల్లో ఆది, మధ్యాంతాలు స్పష్టంగా ఉంటాయి. కొందరి కథల్లో ఆద్యంతాలు మసక మసకగా ఉంటాయి. ఇలాంటి కథలో మధ్యభాగమే ఉన్నట్లు కనిపిస్తాయి. చెహావ్ కథలో ఆద్యంతాలు ఉండవనీ, అవి తాబేళ్ళలాగా ఉంటాయని గాల్సి వర్గీ అనే రచయిత అంటాడు. చెహోవ్ కథలు ఒక సంఘటనల వరసను కాకుండా ఒక ‘స్థితి‘ వర్ణిస్తాయి. ఆ కథలో ఆద్యంతాలు కాగితం మీద కనిపించవు. రచయిత మనసులో ఉంటాయి. పాఠకుని ఊహల్లో రూపుదిద్దుకుంటాయి.
ఈ పద్ధతినే తిలక్ ‘ఊరిచివరి ఇల్లు‘ కథలో అనుసరించాడు. ఈ కథ ఆంధ్ర పత్రిక శార్వరి సంవత్సరాది సంచికలో ప్రచురించబడింది. అంటే ఇప్పటికి 60 సంవత్సరాల క్రితం 1960లో ముద్రించబడింది. ఈ కథ సాయంత్రం మొదలై రాత్రంతా నడిచి తెల్లారేసరికి ముగుస్తుంది. ఒక యువతి జీవితంలో ఒక రాత్రి తెచ్చిన మార్పు ఈ కథ. సాయంత్రం వర్షాన్ని చూస్తూ కూర్చున్న రమ ఒక బాటసారి వానలో తడుస్తూ అతి కష్టంమీద పోతూ ఉండటం చూసి పిలుస్తుంది. తానీ ఊరికి కొత్తవాడిననీ, స్నేహితుడి కోసం వస్తే అతడు చనిపోయాడని, ఆ దుఃఖంతో తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పుకున్నాడు ఆ వ్యక్తి. జాలితో ఆమె అతనికి పొడిగుడ్డలిచ్చి భోజనం పెట్టి ఈ రాత్రికి అక్కడే విశ్రమించ మంటుంది. ఆమె దయార్ద్ర హృదయానికి అతను పొంగి పోతాడు. తన పేరు జగన్నాధమని మిలటరీలో పనిచేస్తున్నానని చెపితే, ఆమె ఆశ్చర్యపోయి తన చిన్ననాటి స్నేహితుడు విజయుడు కూడా మిలటరీలో చేరాడని చెపుతుంది. తన స్నేహితుడిని అతనిలో వెతుక్కుంటుంది. రమ అనాధ అనీ, ఏ దిక్కూ లేక వేశ్యావృత్తి లో ఉందని తెలిసిన జగన్నాథం ఆమెను వివాహం చేసుకుంటానంటాడు. రమను ఆశ్రయించుకుని జీవిస్తున్న ముసలిది రమ వెళ్ళిపోతే తనకు జరుగుబాటు ఉండదని, జగన్నాధంతో రమపై లేనిపోని కలిపించి డబ్బు కోసం నాటకాలు ఆడుతుందని నిందలు వేస్తుంది. మనసు విరిగిన జగన్నాథం తన దగ్గర ఉన్న వెయ్యి నిద్రపోతున్న రమ దగ్గర పెట్టి బాధలో వెళ్ళిపోతాడు. తెల్లవారగానే నిజం తెలిసిన రమ, రైల్వేస్టేషన్కు పరుగెత్తికెళ్లి కదులుతున్న రైలు పెట్టెల్లో ఉన్న జగన్నాథానికి ఆ పర్సు ఇచ్చి కింద పడిపోతుంది. రైలు ముందుకు కదలి వెళుతుంది. నిజమేమిటో జగన్నాథానికి తెలుస్తుంది. స్థూలంగా కథ మధ్యభాగం ఇది. కథలో ముందు చెప్పవలసిన విషయాలు, పాత్రల పరిచయం కథ మధ్యలో అస్పష్టంగా ఉంటాయి. ముగింపు పాఠకుల ఊహకే వదిలేసాడు రచయిత. కానీ కొన్ని సూచనల ద్వారా వారిద్దరూ కలుసుకుంటారని చెపుతారు. పర్సులో ఉన్న జగన్నాధం ఫోటో రమ దగ్గరే ఉండడం డబ్బుకోసం రమ అబద్ధాలు చెప్పలేదనీ వాస్తవం తేలడం. మొదలైన సూచనల ద్వారా ముగింపు పాఠకుల ఊహకు వదిలేశాడు రచయిత. ఆద్యంతాలు రచయిత మనసులో ఉంటాయి. పాఠకుల ఆలోచనల్లో రూపుదిద్దుకుంటాయి. అన్నదానికి ఈ కథ నిదర్శనంగా నిలుస్తుంది.
తిలక్ నిర్మాణ సౌష్ఠవంలో చెహోవ్ ను అనుసరించారు. క్లుప్తత, అనుభూతి ఐక్యత, ఘర్షణలను కథలో సాధిస్తూనే నిర్మాణానికి తన కథల్లో పెద్ద పీటవేసాడు.
అందుకే 60 సంవత్సరాల తరువాత కూడా ఆ కథలు సజీవంగా నిలిచిపోయాయి.
———–