| పేరు (ఆంగ్లం) | pulugurtha Venkataramarao | 
| పేరు (తెలుగు) | పులుగుర్త వేంకటరామారావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | సూరమ్మ | 
| తండ్రి పేరు | సోమరాజు | 
| జీవిత భాగస్వామి పేరు | సుబ్బాయమ్మ | 
| పుట్టినతేదీ | 10/10/1902 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | తూర్పుగోదావరి జిల్లా, కోలంక గ్రామం | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | ఆదర్శ ఉపాధ్యాయుడు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | వేములవాడ శతావధానము, అవధానములు, పరీక్షిచ్చరిత్రము, రామాయణము, ఉత్తర రామాయణము, సత్యనారాయణ, పిచ్చిపుల్లయ్య శ్రీ కృష్ణశతకము, శ్రీ నృసింహరాట్ స్మృతి, శ్రీ రాజ్ఞీ సుభద్రయాంబికా స్మృతి | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | కవిభూషణ, మధురకవి | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | పులుగుర్త వేంకటరామారావు | 
| సంగ్రహ నమూనా రచన | – | 
పులుగుర్త వేంకటరామారావు
పులుగుర్త వేంకటరామారావు తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత, శతావధాని మరియు ఆదర్శ ఉపాధ్యాయుడు.
పులుగుర్త వేంకటరామారావు 1902, అక్టోబర్ 10వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, కోలంక గ్రామంలో సూరమ్మ, సోమరాజు దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య తుని, రామచంద్రాపురం, పెద్దాపురం పట్టణాలలో చదువుకొన్నాడు. తరువాత సోమావజ్ఝల సూర్యనారాయణశాస్త్రి, శృంగారం సింగరాచార్యులు, మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రుల వద్ద సంస్కృతాంధ్రాలలో కావ్య,నాటకాలు, అలంకార శాస్త్రము, శబ్దశాస్త్రము నేర్చుకున్నాడు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందాడు.
ఇతడు 1935లో కోటరామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉద్యోగంలోనికి చేరాడు. అక్కడ వేదుల సత్యనారాయణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి ఇతని సహోద్యోగులుగా ఉండేవారు. 1951లో ఇతడు తన స్వగ్రామమైన కోలంకలో అక్కడి పురప్రముఖుల సహకారంతో ఒక హైస్కూలును స్థాపించాడు. దాని పేరు మొదట పులుగుర్త రామారాయ ఉన్నతపాఠశాల అని వుండి తరువాత ఎస్.డి.వి.ఆర్.ఆర్ హైస్కూలుగా మార్చబడింది. ఈ హైస్కూలు ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యాదానం చేశాడు. తరువాత 1954లో ధవళేశ్వరం హైస్కూలులో తెలుగు పండితుడిగా చేరి మరణించేవరకు అక్కడే పనిచేశాడు.
ఇతడు ప్రప్రథమంగా 1934లో కోలంకలో అష్టావధానం చేశాడు. తరువాత కాకినాడ, పల్లిపాలెం, తుని, రామచంద్రాపురం,వేములవాడ, యానాం మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలే కాక ద్విగుణిత అష్టావధానం, ద్వాదశావధానం, శతావధాన గర్భిత అష్టావధానం వంటివి చేశాడు. ఇతడు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, లాటిన్ భాషలలోని వాక్యాలను వ్యస్తాక్షరిలో అవలీలగా ప్రకటించేవాడు. ఒకేసారి ముగ్గురు పృచ్ఛకులకు త్రిధావ్యస్తాక్షరి అనే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాడు.
ఇతడి అవధానాలలో కొన్ని పూరణలు:
సమస్య: గణచతుర్థినాడు ఫణి చతుర్థి
పూరణ:
చిగురుబోడి వినుము చెల్మిదీపింపంగ
పాలు పోసినారమోలి మనము
పరమ భక్తితోడ పరగ కార్తికదిన
గణచతుర్థినాడు ఫణిచతుర్థి
సమస్య: భీష్మ ద్రోణుల కావహంబుఁ గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్
పూరణ:
గ్రీష్మాదిత్య ప్రతాప శోభిత నాభీలా జిరంగోన్నతా
ర్చిష్మ త్పుత్రుని మున్ను కౌరవులలో సేనాధిపత్యం బొగిన్
భీష్మ ప్రక్రియఁ గల్గె నేరి కవియే వేడ్కందగెన్ ధారుణిన్
భీష్మ ద్రోణుల కావహంబుఁ గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్
దత్తపది: జనానా – దేవిడీ – లుంగీ – పానీ అనే పదాలతో అంజనాదేవి, వాయుదేవుల వలపు
పూరణ:
ఎక్కడిది వెలుంగీ శరదిందు వదన
అంజనా! నా యెడకు నిట్టుల రుసమంద
మమ్మనగ గొప్ప దేవిడి రంజిలంగ
నరిగె పతికడ కేడవలపాని యాపె
———–
 
					 
																								