 
													| పేరు (ఆంగ్లం) | Ponnikanti Telaganna | 
| పేరు (తెలుగు) | పొన్నికంటి తెలగన్న | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | భావనార్యుడు | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | సా.శ.1520 | 
| మరణం | సా.శ.1600 | 
| పుట్టిన ఊరు | పొటం చెరువు లేదా పొట్ల చెరువు, మెదక్ జిల్లా. | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | యయాతి చరిత్రము | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | పొన్నికంటి తెలగన్న | 
| సంగ్రహ నమూనా రచన | ఈయనకు బూర్వమునం దుండినకవులు కొందరు తమ కృతులలో నక్కడక్కడ నొక్కొక్క యచ్చతెలుగు పద్యమును వేయుచు వచ్చిరి. అట్టివానిని జూచియే జను లత్యాశ్చర్యపడుచుండిరి. ఈయంశము కృతిపతి యన్నట్లుగా యయాతి చరిత్రముయొక్క పీఠిక యం దీక్రిందిపద్యముతో జెప్పబడినది.- ఉ. అచ్చ తెనుంగుపద్దె మొక టైనను గబ్బములోన నుండినన్ హెచ్చని యాడు చుందు రదియెన్నుచు బెద్దలు పొత్త మెల్లని ట్లచ్చ తెనుంగున న్నొడువ నందులచంద మెఱుంగువారు నిన్ మెచ్చరొ యబ్బురం బనరొ మేలనరో కొనియాడరో నినున్. | 
పొన్నికంటి తెలగన్న
ఈ తెలగనార్యు డచ్చతెనుగు గ్రంథములు చేసినవారిలో మొదటివాడు. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; భావనార్యుని పుత్రుడు. అచ్చతెనుగునందు గ్రంథములు రచియించుట మిక్కిలి కష్టము. ఈకవికి బూర్వమునం దెవ్వరును శుద్ధాంధ్రభాషలో ప్రబంధములు చేయుటకు ప్రయత్నించినవారైనను లేరు. ఇట్టిగ్రంథరచన కీతడు మొట్టమొదటివాడే యయినను, ఈకవి రచియించిన యయాతి చరిత్రము సర్వవిధములచేతను కూచిమంచి తిమ్మకవి రచియించిన యచ్చతెలుగు పుస్తకములకంటె శ్రేష్ఠతరముగా నున్నదని నాయభిప్రాయము. ఈయనకు బూర్వమునం దుండినకవులు కొందరు తమ కృతులలో నక్కడక్కడ నొక్కొక్క యచ్చతెలుగు పద్యమును వేయుచు వచ్చిరి. అట్టివానిని జూచియే జను లత్యాశ్చర్యపడుచుండిరి. ఈయంశము కృతిపతి యన్నట్లుగా యయాతి చరిత్రముయొక్క పీఠిక యం దీక్రిందిపద్యముతో జెప్పబడినది.-
ఉ. అచ్చ తెనుంగుపద్దె మొక టైనను గబ్బములోన నుండినన్
హెచ్చని యాడు చుందు రదియెన్నుచు బెద్దలు పొత్త మెల్లని
ట్లచ్చ తెనుంగున న్నొడువ నందులచంద మెఱుంగువారు నిన్
మెచ్చరొ యబ్బురం బనరొ మేలనరో కొనియాడరో నినున్.
ఈకవి తనగ్రంథము నమీనుఖానునకు కృతి యిచ్చెను, ఈ యయాతిచరిత్రముగాక యింకొక తెలుగు గ్రంథము మాత్రము మహమ్మదీయప్రభువున కంకితము చేయబడెను. అమీనుఖాను ఇభరాముశాయొద్ద కొలువున్నట్టు యయాతి చరిత్రములోని యీక్రిందిపద్యము వలన దెలియవచ్చు చున్నది. సీ. తెలివి సింగంపుగద్దియలరాతెఱగంటిదొరలెల్ల మోడ్పుచేతులనెకొల్వ
బూనియేబదియాఱుమానిసినెలవులపుడమిఱేండ్లూడిగంబులకుజొరగ
ఠీవి మున్నీటిలో దీవు లన్నియు నేలుమన్నీలు మెట్టదామరల కెరగ
దనతేజు సుడిగట్టువెనుక చీకటి నెల్ల విరియించు తమ్ములవిందుగాగ
వెలయు మలికిభరాముశా గొలిచిమనుచు
కలన దనచెయ్యి మీదుగా గడిమిమెఱసి
మేలుసిరు లందునట్టి యమీనుఖాన
యొడయ డొకనాడు నిండుపేరోలగమున.
ఇబ్రహీమునే మనవారు గ్రంథములలో నిభరామని వాడి యున్నారు. ఈతనిపేరనే కృష్ణామండలములో నిభరామపురమని యొకయూరు కట్టబడినది. ఈతని పూర్ణమైన పేరు ఇబ్రహీమ్ కుతుబ్షా. ఇతడు కుతుబ్షా వంశీయులయిన గోలకొండనవాబులలో మూడవవాడు. ఈతని తండ్రిపేరు జామ్షీద్కులికుతుబ్షా. ఇతడు క్రీస్తుశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. కాబట్టి గ్రంథకర్త యయిన తెలగనార్యుడును ఈకాలములోనే యున్నట్టు స్పష్టమగుచున్నది. యయాతి చరిత్రములోని యీక్రింది పద్యములో నమీనుఖానుని కొడుకయిన ఫాజిలఖాన్ విజయనగరపురాజైన శ్రీరంగరాయని గోలకొండకు దీసికొనివచ్చి మైత్రిచేసినట్టు చెప్పబడి యున్నది.
చ. కని తను రాజు లెన్నుకొనగా బెనుపౌజులతో సిరంగరా
యనికడ కేగి మాటలనె యాయన దేఱిచి తెచ్చి మల్కకున్
మనుకువ నంటుచేసి యొరిమం దగ మెచ్చులుగొన్నమేటి నే
మని పొగడంగవచ్చు నవునౌ నిక ఫాజిలఖానరాయనిన్.
ఆంధ్ర కవుల చరిత్రము నుండి…
———–
 
					 
																								 
																								